ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజనే వేరు… గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు అందరూ కృషి చేయాలని..అప్పుడే రాష్ర్టం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మకం. అందుకే ఆయన గ్రామాల అభివృద్ధిలో ఎన్ఆర్లను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. ఈ పథకానికి స్పందించిన చాలా మంది ఎన్ఆర్ ఐలు తమ వంతుగా తమ గ్రామాల అభివృద్ధికి భారీగా విరాళాలు ఇచ్చి గ్రామాభివృద్ధికి తమ వంతుగా కృషి చేశారు. అయితే ఈ పథకాన్ని కూడా కొందరు తమ స్వార్థానికి వాడుకోవడంతో సీఎం అసలు లక్ష్యం గాడి తప్పి…స్మార్ట్ పథకం కాస్త స్మార్ట్ దోపిడీగా మారిపోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో గ్రామాభివృద్ధికి ఓ ఎన్ఆర్ ఐ లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తే ఆ పనులకు కూడా సర్పంచ్ బిల్లులు పెట్టి సొమ్ములు చేసుకోవడం ఇప్పుడు స్మార్ట్ పథకం ఎలా దుర్వినియోగం అవుతుందో చెపుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామానికి చెందిన ఎం.వీ.రామారావు అనే ఎన్ఆర్ ఐ చంద్రబాబు పిలుపు మేరకు స్పందించి స్మార్ట్ విలేజ్ కోసం తన సొంత డబ్బులతో పాటు స్నేహితుల ద్వారా, ఇతరత్రా రూ.10 లక్షలకు పైగా సొమ్ములు సేకరించి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీరికి సహరించవలసిన సర్పంచ్, ఆయన అనుచరులు వీరు చేసిన పనులకు కూడా బిల్లులు పెట్టుకుని డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్ఆర్ ఐ రామారావు సన్నిహితులు సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకుంటే అందులో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.
రామారావు సేకరించిన విరాళాలతో చేసిన అభివృద్ధి పనులకు సర్పంచ్ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నట్టు తేలింది. అయితే ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన సర్పంచ్, అతని కుమారుడు, అతని వర్గీయులు రామారావు తల్లి దండ్రులపై దాడి చేయడమే కాకుండా వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టినట్టు ఎన్ఆర్ ఐ రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఎన్ ఆర్ ఐలు ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా చంద్రబాబు స్మార్ట్ విలేజ్ కాన్సెఫ్ట్ కూడా దెబ్బతింటుందన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఈ పథకంలో అక్రమంగా బిల్లులు చేసుకునే అక్రమార్కుల జోక్యానికి అడ్డుకట్ట వేసి స్మార్ట్ విలేజ్ పథకం కాన్సెఫ్ట్ పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
No comments:
Post a Comment