ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. చంద్రబాబు, మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు రోజుల పాటు నడిచిన ఉద్రిక్త పరిస్థితులు ఇక శాంతించనున్నాయి. అయితే దీక్ష విరమించిన అనంతరం ముద్రగడ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దీక్షకు పూనుకోవడానికి గల కారణాలు వివరించారు. ఇందులో భాగంగా చంద్రబాబును క్షమించాలని కోరారు.
కాపులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ ఆలస్యమైందని అనుమానించి తాను దీక్షకు దిగానని, అంతే తప్ప ముఖ్యమంత్రిని లేదా ప్రభుత్వానిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని ముద్రగడ సోమవారం తెలిపారు. సోమవారం దీక్ష విరమించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చంద్రబాబు పలుమార్లు చెప్పారన్నారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఆయన కాళ్లు మొక్కేందుకు కూడా వెనుకాడనని చెప్పారు. తన జాతి బాగు కోసం ఏమైనా చేస్తానని చెప్పారు.
కాపులను, కాపు ఉప కులాలను బీసీలలో కలుపుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలుమార్లు చెప్పారన్నారు. అది ఆలస్యమవుతుందనే తాను దీక్షకు దిగానని చెప్పారు. తన దీక్షకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. తన జాతికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే తాను దీక్ష చేశానని చెప్పారు. ప్రభుత్వం తరఫున మంత్రులు వచ్చి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు, మంత్రుల వ్యూహం ఫలించిందనే చెప్పాలి.
No comments:
Post a Comment