అడుగడుగునా పోలీసులు.. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఆధునిక సాంకేతిక వ్యవస్థ.. మైలుకో పోలీసు చెక్ పోస్టు.. నిరంతరం పోలీసు పహారా.. పొలాల్లోనూ, నదిలోనూ ఎటు చూసినా పోలీసు బీట్లు, పడవల్లోనూ పహారాలే. ఇదీ కృష్ణా తీరంలో ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఉండే భద్రత. అయితే ఈ భద్రత అంతా పేపర్ల వరకే పరిమితమా? సీఎం ఇంటికే భద్రత కరువైందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే సీఎం నివాస సమీపంలోనూ, సీఎం వెళ్లే దారిలో ఉన్న వంతెనల వద్ద ఉన్న లైట్లను (5000 వాట్ల సామర్థ్యం) దొంగలు ఎత్తుకుపోవడం భద్రతా లోపాన్ని చెప్పకనే చెబుతోంది. అయితే విషయం బయటకు పొక్కితే తమ భద్రతలోని డొల్లతనం ఎక్కడ బయటపడుతుందోనంటూ భద్రతాధికారులు భావించారు.
అందుకే ‘ఎక్కడి దొంగలు అక్కడే… గప్చుప్’ అంటూ విషయం బయటకు రానీయలేదు. పోయిన లైట్లు ఖరీదైనవి కావడం, ముఖ్యమంత్రి ఇంటి వెనుకవైపు కారు చీకట్లు కమ్ముకోవడం, వంతెనల వద్ద చీకటి రాజ్యమేలుతుండడంతో జరిగిన దొంగతనం బయటకు రాకుండా మేనేజ్ చేసి ఉండవల్లి పంచాయతీని కొత్త లైట్లు వేయాలంటూ భద్రతా సిబ్బంది ఆదేశించారు. అయితే అంత బడ్జెట్ ఉండవల్లి పంచాయతీకి లేకపోవడంతో వారు లైట్లు ఏర్పాటు చేయలేమని చేతులెత్తేశారు. కానీ భద్రతా సిబ్బంది సీఎం భద్రత పేరుతో ఒత్తిడి తేవడంతో తాత్కాలికంగా అద్దెకు లైట్లు తీసుకువచ్చి వెలుగులు నింపారు.
అయితే తీసుకొచ్చిన లైట్లకు పదిహేను రోజులు గడిచినా అధికారులు అద్దె చెల్లించకపోవడంతో ఆదివారం సదరు లైట్ల యజమాని తన లైట్లను తాను తీసుకుపోయాడు. ఇది గమనించిన కొందరు రైతులు లైట్ల తొలగింపుపై ప్రశ్నించడంతో పదిహేను రోజుల క్రితం జరిగిన దొంగతనం విషయం బయటకొచ్చింది. మరి సీఎం ఇంటి దగ్గరే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటోనని పలువురు రాజధాని ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment