హైదరాబాద్ అభివృద్ధే ప్రధానమని తనకు ఆశలు, ప్రత్యేక అజెండాలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించాక చాలా రిలాక్స్డ్గా ఉన్న కేసీఆర్ మీడియాతో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు భారీ ఆశలు లేవని చెబుతూ తెలంగాణను అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉందన్నారు. ప్రజలకు తగ్గట్టు పార్టీలు ఉండాలన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజలు పాజిటివ్గా స్పందించారని చెప్పారు. విపక్షాలను ప్రజలే వద్దనుకున్నారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారాలకు టౌన్హాల్ మీటింగ్లను నిర్వహిస్తామన్నారు. జంటనగరాలకు గోదావరి జలాలను తీసుకురావడంలో సఫలమయ్యామని, హైదరాబాద్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థను త్వరలోనే బాగుచేస్తామని, హైదరాబాద్ మినీ ఇండియాను ప్రతిబింబిస్తోందన్నారు.
టిక్కెట్ల పంపకాల్లో సమతూకం పాటించామని, గెలిచినవారిలో అన్నిప్రాంతాలవారున్నారని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎంఐఎంతో సంబంధాలుంటాయని, ఇళ్ల ప్లాన్లన్నీ ఆన్లైన్లోనే అనుమతించే సంస్కరణలు తెస్తామని తెలిపారు. ప్రజల మీద ఉప ఎన్నికలు రుద్దాలనే ఆలోచన తమకు లేదని, సనత్నగర్ ఉపఎన్నిక విషయం స్పీకరే తేలుస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్కు వారసత్వం అన్న అంశమే ఉత్పన్నం కాదని ప్రకటించారు. గ్రేటర్లో ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. హైరదాబాద్లో మూడు పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దుర్గంచెరువు, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను..పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మరో 150 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడతామని చెప్పారు కేటీఆర్.
No comments:
Post a Comment