తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లో పండిస్తున్న క్యాబేజీలను ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్ రావు ఖేడ్ ప్రజల చెవుల్లో పెడుతున్నారని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఓటమితో..నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించాయి. ఆదివారం తమ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి..కేసీఆర్ ఫ్యామిలీపై మళ్ళీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వినిపించిన సవాళ్లు ఖేడ్ లోనూ మారుమోగుతున్నాయి. ఖేడ్ లో ఓడితే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు ప్రకటించారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ టీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. గతంలో ఖేడ్ ను పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతోందని రేవంత్ ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు సింగూర్ ప్రాజెక్టు ఎండగట్టారని..అందుకే జిల్లాలో మంచి నీటి కరువు ఏర్పడిందని ఆరోపించారు.
కేసీఆర్ పండిస్తున్న క్యాబేజీలను హరీష్ రావు ఖేడ్ ప్రజల చెవిలో పెడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని తేల్చిచెప్పారు..టీఆర్ఎస్ లో స్థానం లేని హరీష్ రావు నారాయణ్ ఖేడ్ ను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణలో పుట్టింది..తెలంగాణలో పేదల పక్షాన ఉన్న పార్టీ టీడీపీనే అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నా..గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రోళ్లకు ఇరవై టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ మాదిరి నారాయణ్ ఖేడ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తే తాము ఎన్నికల నుంచి తప్పుకుంటామని రేవంత్ సవాల్ చేశారు.
No comments:
Post a Comment