జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు దెబ్బకు విపక్షాలు విలవిల్లాడాయి. టీడీపీ,బీజేపీ, కాంగ్రెస్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 99 స్థానాలు సాధించి సొంతంగానే మేయర్ పీఠం సొంతంచేసుకుంది టీఆర్ఎస్. కారు జోరు ముందు విపక్షాలు బేజారయిపోయాయి. అయితే టీడీపీ, కాంగ్రెస్లకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ దుమ్మురేపింది. ఈ విషయంలో విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లు కారణమన్న అనుమానాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రావణ్ మాట్లాడుతూ ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని విమర్శించారు. గతంలో టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కూడా ఈవీఎంలపైనే సందేహాలు వ్యక్తం చేసిందని శ్రావణ్ గుర్తు చేశారు. ఈవీఎంలతో పాటు, ఓటు తాము వేసినవారికే పడిందా లేదా అని తెలిపే స్లిప్ లను ఓటర్లకు ఇవ్వాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి డివిజన్ లో కాంగ్రెస్ కు ఓటు వేశామని చెబుతున్నవారికీ, వచ్చిన ఓట్లకు తేడా వస్తోందని తెలిపారు. పోలైన ఓట్లు, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లలో తేడా కనిపిస్తోందని ఆరోపించారు. లెక్కింపు సమయంలో కూడా కొన్ని తేడాలు గమనించినట్లు ఆమె చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని విపక్షాలు ఆరోపించడం సర్వసాధారణమే! మరి వీటిలో గోల్మాల్ నిజమో కాదో ఎవరికి తెలిస్తుంది !
No comments:
Post a Comment