ఎంతో ఉత్కంఠగా గ్రేటర ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.. మేయర్ ఎవరు? ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు? అయితే ఇప్పటికే మేయర్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే టీఆర్ఎస్ స్పష్టంగా ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్..ఎన్నో సమస్యల వలయం చుట్టూ ఉన్న అందమైన నగరం. సవాలక్ష సమస్యల తో పాటు కనీసం మౌలిక సదుపాయాలు లేని దుస్థితి. ఈ నేపథ్యంలో సమర్ధుడు, యువకుడికే గ్రేటర్ పగ్గాలు అప్పగిస్తే పాలన దూకుడుగా సాగుతుందనే అభిప్రాయాలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్ ను మేయర్ చేయాలన్నది కేసీఆర్ అభిమతమని తెలుస్తోంది. అలాగే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మీ పేరు కూడా వినిపిస్తోంది. ఇద్దరి గెలుపూ నల్లేరు మీద నడకే అని తెలుస్తోంది. మేయర్ స్థానాన్ని అప్ప గించాలనే ఉద్దేశ్యంతోనే వ్యూహాత్మకంగా కేకే కుమార్తెను జూబ్లీ హిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు.
చివరి జాబితాలో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రాంమోహన్ చర్లపల్లి డివిజన్ నుంచి బరిలోకి దింపారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన బొంతును చర్లపల్లి డివిజన్ నుంచి బరిలో నిలిపారు. వాస్తవానికి తొలుత మైనంపల్లి హన్మంతరావును మేయర్ గా అనుకున్నారు. అయితే.. రిజర్వేషన్లలో భాగంగా మేయర్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో ఆయన రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో యువకుడు, సమర్థుడు, కేసీఆర్ సన్నిహితుడుగా రామ్మోహన్ కు మేయర్ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరి మరికొన్ని గంటల్లో అభ్యర్థిపై ఉత్కంఠ వీడనుంది.
No comments:
Post a Comment